Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ పై బాలీవుడ్ నటి కాజోల్ షాకింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశం’’ అని ఆమె పేర్కొనడంతో నెటిజన్ల మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి.

తాజాగా తన కొత్త హారర్ సినిమా ‘మా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్, తన షూటింగ్ అనుభవాలపై స్పందిస్తూ, ‘‘కొన్ని ప్రదేశాల్లో నెగటివ్ ఎనర్జీ, భయానకమైన వాతావరణం కనిపించింది. అక్కడ ఉండలేను. వెంటనే వెళ్లిపోవాలనిపించింది. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా నాకు అలాంటి అనుభూతే కలిగింది’’ అని చెప్పింది.

అయితే ఆమెను భయపెట్టిన సంఘటన ఏమిటన్నది మాత్రం స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం. ప్రపంచంలోని అతిపెద్ద ఫిలిం సిటీలలో ఒకటైన రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటివరకు అనేక హిట్ సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. అలాంటి అద్భుతమైన ప్రదేశంపై కాజోల్ ఇలా వ్యాఖ్యానించడాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె అనుభవం కావచ్చు అని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వివాదం నడుమ కాజోల్ నటించిన హారర్ సినిమా ‘మా’ జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Leave a Reply