బాలీవుడ్ సినీ పరిశ్రమను కుదిపేసే మరో సంఘటన వెలుగు చూసింది. ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యారు. ఓ యువతిని హీరోయిన్ చేస్తానని మోసగించి, లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా, కోర్టు తిరస్కరించడంతో సోమవారం ఉదయం అరెస్ట్ చేయటం జరిగింది.
2020లో టిక్టాక్ ద్వారా సనోజ్ మిశ్రా బాధిత యువతికి పరిచయమయ్యాడు. వీడియోలు బాగా నచ్చాయని, త్వరలో సినిమా ఛాన్స్ ఇస్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఆమె హీరోయిన్ కావాలనే ఆశతో అతనికి దగ్గరైంది. ఈ క్రమంలో ఇద్దరూ యూపీలోని జాన్సీ రైల్వే స్టేషన్ వద్ద రహస్యంగా కలుసుకునేవారని తెలుస్తోంది.
ఆ తర్వాత సనోజ్ మిశ్రా అసలు రంగు బయటపడింది. “నా మాట వినకపోతే ఆత్మహత్య చేసుకుంటా” అంటూ బెదిరించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.
ఇదే సమయంలో, సనోజ్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ది డైరీ ఆఫ్ మణిపూర్” సినిమా ప్రధాన పాత్ర పోషించబోయే మోనాలిసా పేరు కూడా తెరపైకి వచ్చింది.
మధ్యప్రదేశ్లోని ఓ పల్లెటూరికి చెందిన మోనాలిసా మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఆమెను చూసిన సనోజ్ మిశ్రా, సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి, నటనలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు అతని అసలు స్వరూపం బయట పడడంతో, మోనాలిసా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
బాలీవుడ్లో గతంలోనూ కాస్టింగ్ కౌచ్ ఘటనలు వెలుగు చూసినా, ఇప్పుడు నేరుగా అత్యాచారం ఆరోపణలు రావడంతో సినీ పరిశ్రమలో తీవ్ర చర్చ మొదలైంది. మరిన్ని వివరాలు విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి!