టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత తెరపైకి రాబోతున్న చిత్రం ‘ఘాటీ’. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ కానుంది. విడుదలకు ఇంకా రెండు రోజులు ఉండగానే, ఈరోజు ఉదయం ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బుక్ మై షోలో ఇప్పటికే పలు థియేటర్లు హౌజ్ఫుల్గా మారాయి. మొత్తానికి ‘ఘాటీ’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హంగామా మొదలైంది.
‘అరుంధతి’, ‘భాగమతి’ తరహా బ్లాక్బస్టర్స్ తర్వాత అనుష్క లీడ్ రోల్లో నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా మీద ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.
యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, జగపతి బాబు, జిషు సేన్గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కథాంశం: గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథ ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో నడుస్తుంది. ఇందులో అనుష్క శీలావతి అనే పాత్రలో కనిపించనుంది. ఒక సాధారణ బస్ కండక్టర్గా మొదలైన ఆమె జీవితం, ఆ తర్వాత స్మగ్లింగ్ సామ్రాజ్యానికి రాణిగా ఎలా ఎదిగిందనే అంశమే సినిమా కథగా ఉంటుందని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది.
‘ఘాటీ’లో అనుష్క మునుపెన్నడూ కనిపించని విధంగా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ అవతారంలో కనిపించబోతోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ‘వేదం’ తర్వాత అనుష్క – క్రిష్ కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇదే కావడం మరో స్పెషల్ అట్రాక్షన్గా మారింది.