వివాదంలో అనుపమ పరమేశ్వరన్ సినిమా.. హిందూ మనోభావాలపై సెన్సార్ అభ్యంతరం!

మలయాళ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలతో అభిమానులను మెప్పించింది. ‘ప్రేమమ్’, ‘కార్తికేయ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘శతమానం భవతి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ, ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో బిజీగా ఉంది.

ఇటీవల ఆమె నటించిన ‘డ్రాగన్’ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అనుపమ, మలయాళ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సురేష్ గోపీ, దివ్య పిళ్లై, శృతి రామచంద్రన్, బైజు సంతోష్, ఆస్కార్ అలీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.

అయితే సినిమా విడుదలకు ముందు ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. అనుపమ పోషించిన బాధితురాలి పాత్రకు ‘జానకి’ అనే పేరు పెట్టడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. జానకి పేరు హిందూ దేవత అయిన సీతాదేవికి సమానం కావడంతో, అత్యాచార బాధితురాలి పాత్రకు ఈ పేరు వాడడం మతభావాలను దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. దీంతో, టైటిల్‌తో పాటు పాత్ర పేరు మార్పు చేయకపోతే సర్టిఫికెట్ ఇవ్వబోమని బోర్డు స్పష్టం చేసింది.

ఈ వివాదంపై మలయాళ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా స్పందించింది. హిందూ దేవతల పేర్లను అపవిత్రంగా చూపడం సరికాదని పేర్కొంటూ, పేరు మార్చకపోతే విడుదలకు అనుమతి ఇవ్వమని హెచ్చరించింది.

ఇక దీనిపై చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. “జానకి అనేది సాధారణ పేరు మాత్రమే. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో ఈ పేరును వాడలేదు” అని వివరణ ఇచ్చారు. అయితే పేరు మార్చే అవకాశం లేదంటూ సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని అప్పీల్ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Reply