TG 10th Results 2025: తెలంగాణ టెన్త్ ఫలితాలు రేపే విడుదల.. మార్కుల విధానంలో కీలక మార్పులు..!

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీ బుధవారం విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

ఈసారి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వాడుతున్న జీపీఏ విధానాన్ని పూర్తిగా తొలగించి మళ్లీ మార్కుల విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. అంటే ఈసారి ఫలితాల్లో విద్యార్థులకు సబ్జెక్టులవారీగా మార్కులతో పాటు గ్రేడ్లు కూడా చూపించనున్నారు. మార్కుల మెమోలపై ఒక్కో సబ్జెక్టులో వచ్చిన రాత పరీక్ష మార్కులు, ఇంటర్నల్స్, మొత్తంగా వచ్చిన మార్కులు, వాటికి అనుగుణంగా గ్రేడ్లు, అలాగే పాస్/ఫెయిల్ స్టేటస్‌ కూడా స్పష్టంగా ఉంటాయి.

ఇది విద్యార్థులకు ప్రయోజనకరంగా మారనుంది. ఎందుకంటే పలు ఎంట్రన్స్ పరీక్షలలో జీపీఏ కంటే మార్కుల ప్రాతిపదికే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అందుకే విద్యాశాఖ ఈ మార్పును తీసుకురావడమే కాకుండా, వచ్చే ఏడాది నుంచి టెన్త్ క్లాస్‌లో ఇంటర్నల్స్‌ను కూడా పూర్తిగా రద్దు చేసి ప్రతి సబ్జెక్టుకు 100 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహించనుంది.

గత మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 80 మార్కుల రాత పరీక్షలతో పాటు 20 మార్కుల ఇంటర్నల్స్‌ నిర్వహించబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫలితాల ప్రకటనకు సమయం చేరుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను శ్రద్ధగా పరిశీలిస్తూ సిద్ధంగా ఉండాల్సిన సమయం ఇది.

Leave a Reply