పిల్లల విద్య విషయంలో తల్లిదండ్రులకు ముందుగా ఎదురయ్యే ముఖ్యమైన ప్రశ్న.. CBSE చదివించమా? లేక స్టేట్ బోర్డా? ఇది కేవలం పాఠ్యపుస్తకాల ఎంపిక మాత్రమే కాదు, భవిష్యత్తు దిశను నిర్ణయించే కీలక అంశం. మరి ఏది ఎంపిక చేయాలి?
సరైన బోర్డు ఎంపిక ఎలా చేయాలి?
ఏది మంచిదన్న దానికంటే, మీ పిల్లల లక్ష్యానికి ఏది అనుకూలంగా ఉంటుంది? అనే కోణంలో ఆలోచించాలి. పిల్లల లక్ష్యం జాతీయ స్థాయి పరీక్షలు (JEE, NEET) లాంటివైతే CBSE ఉత్తమ ఎంపిక. ఎందుకంటే ఆ పరీక్షల సిలబస్ ప్రధానంగా NCERT పుస్తకాలపై ఆధారపడి ఉంటుంది.
అలాగే, ఇంజనీర్, డాక్టర్, ఇతర జాతీయ స్థాయి కోర్సులు లక్ష్యంగా పెట్టుకుంటే CBSE సిలబస్ బలమైన ఫౌండేషన్ ఇస్తుంది.
స్టేట్ బోర్డు ఎప్పుడు సరైనది?
మీ పిల్లలు గ్రూప్స్, స్టేట్ PSC, స్టేట్ సివిల్స్ వంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారంటే స్టేట్ బోర్డు చక్కటి ఎంపిక. ఎందుకంటే ఇది రాష్ట్ర చరిత్ర, భాష, సంస్కృతి వంటి అంశాలపై లోతైన అవగాహనను కల్పిస్తుంది.
CBSE సిలబస్ కఠినమా?
కఠినమని కాదు, విభిన్నంగా ఉంటుందనాలి. ఇది బట్టి విధానానికి బదులుగా అవగాహనపై ఆధారపడుతుంది. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా, దీని ద్వారా ఆలోచనాశక్తి, విశ్లేషణాత్మక నైపుణ్యాలు పెరుగుతాయి.
స్టేట్ బోర్డు చదివితే జాతీయ పరీక్షలు రాయలేమా?
అలాంటిది లేదు. ఎన్నో స్టేట్ బోర్డు విద్యార్థులు JEE, NEET వంటి పరీక్షల్లో విజయాలు సాధించారు. వారు అదనంగా NCERT పుస్తకాలు, ప్రత్యేక కోచింగ్ ద్వారా సిద్ధమవుతారు. కానీ CBSE విద్యార్థులకు ఈ విషయాలు సిలబస్లో భాగంగానే వస్తాయి.
చివరిగా:
బోర్డు ఎంపిక అనేది మార్గం మాత్రమే, గమ్యం కాదు. CBSE గానీ, స్టేట్ బోర్డు గానీ.. ప్రతి బోర్డుకు తగిన ప్రత్యేకత ఉంది. మీ పిల్లల ఆసక్తి, సామర్థ్యం, భవిష్యత్తు లక్ష్యాలు, కుటుంబ పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకోండి. పట్టుదలతో కృషి చేసే విద్యార్థి ఎక్కడైనా రాణిస్తాడు.. ఇదే నిజం.