ఒక ఆచారం.. 2 వేల మందిని భయంకరమైన ఆపదనుంచి కాపాడింది..!

ఒక సంప్రదాయం.. 400 కుటుంబాలను మహా విపత్తు నుంచి రక్షించింది…! ఈ ఆధునిక యుగంలో.. ఇలాంటివి వినడానికి వింతగానే ఉన్నా.. నిజం అబద్దం కాదు. ఉత్తరాఖండ్లో సంభవించిన భారీ హిమపాతం పెను ఉపద్రవం నుంచి.. భారతదేశపు మొట్టమొదటి గ్రామం ఎలా బయటపడిందో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. పూర్వీకులు చెప్పిన కొన్ని ఆచార సంప్రదాయాల్ని ఎందుకు పాటించాలి అని అడిగేవారికి ఈ ఘటనే కనువిప్పు కలిగించే ఎవరెస్ట్ అంత అతిపెద్ద ఎగ్జాంపుల్.

ఇక అసలువిషయంలోకి వెళితే ఉత్తరాఖండ్లో కొన్నిరోజులుగా భారీగా మంచు కురుస్తోంది. ఈ క్రమంలో బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. వాటిని తొలగించే క్రమంలోనే 55 మంది కార్మికులు మంచులో చిక్కుకుపోయారు. వారిలో 50 మందిని ఇండియన్ ఆర్మీ రక్షించింది. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. జోషిమఠ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. భారత్ – టిబెట్ సరిహద్దుల్లో.. మన దేశానికి చెందిన మొట్టమొదటి గ్రామం మానా దగ్గరే ఈ దుర్ఘటన జరిగింది. ఇంతకీ ఈ గ్రామం అక్కడే ఎందుకు వుంది… ఏ సంప్రదాయం వారిని కాపాడింది అనే సందేహం కలగవచ్చు.

హిమాలయ పర్వతశ్రేణుల్లో వున్న ఈ మానా విలేజ్ కి… ఘనమైన చరిత్ర వుంది, ఈ గ్రామం పురాణాలతో ముడిపడి ఉన్న ప్రాంతం. ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సర్సవతి నది.. ఈ గ్రామం వద్ద మనం దర్శించుకోవచ్చు. అలాగే మహాభారతంలో ద్రౌపది.. సరస్వతి నదిని దాటేందుకు భీముడు పడగొట్టిన భీమ శిల ఇక్కడే ఉంది. ఇక్కడే వ్యాసుడు గణపతికి మహాభారత గాధను చెప్పగా గణపతి లిఖించాడని పురాణాలు చెబుతున్న వ్యాస గుహ ఉంది. ఈ మనా గ్రామం నుంచే.. పాండవులు స్వర్గరోహిణి అనే మార్గం ద్వారా స్వర్గానికి చేరుకున్నారని చెబుతారు. ప్రతి నవంబర్లో బద్రీనాథ్ ఆలయం తలుపులు మూసిన తర్వాత.. మనా గ్రామ ప్రజలంతా వలస వెళ్లడం మొదలుపెడతారు. ఇదే వారి సంప్రదాయం. తరతరాల నుంచి వస్తున్న ఆచారం.

ఎందుకంటే బద్రీనాథ్ ఆలయం తలుపులు మూసివేస్తే… వారికి వైకుంఠం తలుపులు మూసివేసినట్టే. స్వామివారి ఏకాంతానికి భంగం కలగకుండా వారు మనా గ్రామం నుంచి వెళ్ళిపోతారు. ఇదే అసలు ఆచారం. అయితే శాస్త్రీయంగా కఠినమైన శీతాకాలం నుంచి తప్పించుకునేందుకు.. మనా గ్రామస్తులంతా తమ ఇళ్లు, జీవనోపాధిని వదిలేసి.. చమోలి జిల్లాలోని గోపేశ్వర్, జ్యోతిర్మఠ్, జింక్వాన్ లాంటి దిగువ ప్రాంతాలకు తరలి వెళ్తారు. మళ్లీ.. బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరిచే సమయానికి మాత్రమే.. వారంతా తిరిగి మనా గ్రామానికి చేరుకుంటారు. ఫిబ్రవరి 28వతేదిన సంభవించిన భారీ హిమపాతం కూడా మానా గ్రామానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే జరిగింది. అదృష్టవశాత్తూ మానా ప్రజలంతా తమ ఆచారాన్ని పాటించడం వల్ల.. అంతా ప్రాణాలతో బయటపడ్డారు.

గతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఇక్కడ హిమపాతాలు సంభవించాయి. ఈ గ్రామానికి సమీపంలోనే ఓ ఆర్మీ క్యాంప్ కూడా ఉంది. ముందే.. ఊరిని ఖాళీ చేయడం వల్ల.. 400 కుటుంబాలు విపత్తు నుంచి తప్పించుకున్నాయి. మనా గ్రామం సముద్రమట్టానికి, 3,200 మీటర్ల ఎత్తులో ఉన్న ఇండియా – టిబెట్ సరిహద్దులో చివరి గ్రామం.నేషనల్ హైవేపై భారీగా పేరుకుపోయిన మంచు మేటల్ని.. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది తొలగిస్తుండగా మంచు చరియలు విరిగిపడ్డాయి. దాంతో.. కార్మికులు మంచులో కూరుకుపోయారు.

ఇదంతా.. ఇప్పుడు ఆనాటి దుర్ఘటనలో మనకు కనిపిస్తున్న వాస్తవం. కానీ ఇదే ఘటన వెనుక మనకు ఆశ్చర్యం కలిగించే కోణం ఎవరో చెప్పనట్టుగా 2 వేల మంది భయంకరమై భారీ హిమపాతం నుంచి సేఫ్ బయటపడటం. మనా ఊరిని, అక్కడి జనాన్ని కాపాడింది.. కేవలం పురాతన ఆచారమే! వారు ప్రతి ఏటా పాటించే సంప్రదాయమే! ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇదే వాస్తవం! ప్రతి ఏటా శీతాకాలంలో.. హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడటం సాధారణమే. ఈ చరియలు 5 సెకన్లలోనే గంటకు 80 మైళ్ల వేగంతో కిందకు జారుకుంటాయి. ఇలాంటి ఘటనల్లో భారీగా మంచు విడుదలై.. మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.

ఈ విధమైన పరిస్థితుల్లో మానా ప్రజలకు ఎప్పుడు ఊరిని ఖాళీ చేయాలో.. చాలా కాలంగా తెలుసు. వాళ్లు గనక ముందే దిగువ ప్రాంతాలకు మారకపోయినా.. తమ ఆచార, సంప్రదాయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. వందలాది మంది మంచులోనే చిక్కుకుపోయేవారు. 1962 వరకు ఇండో-టిబెటన్ మధ్య మనా గ్రామం వాణిజ్య మార్గంగా ఉండేది. భారత్ నుంచి ధాన్యాలు, చక్కెర, వస్త్రాలను సప్లై చేసేవారు. టిబెట్ నుంచి రాక్ సాల్ట్, బోరాక్స్, ఉన్ని వచ్చేది. అయితే.. చైనాతో యుద్ధం తర్వాత ఈ సరిహద్దుని మూసేశారు. దాంతో.. వాణిజ్యం ఆగిపోయింది. ఇలా ఓ నమ్మకం.. ఆచారం..సంప్రదాయం మానా గ్రామాన్ని కాపాడింది అనటంలో సందేహం లేదు.

Leave a Reply