భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా, పరంపరాగతంగా వైభవంగా జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో కల్యాణం జరిగి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇది కొందరికి కొత్తగా అనిపించవచ్చు. కానీ ఈ ఆచారం ఎంతో పాతది, నిజానికి ఇది 135 ఏళ్ల చరిత్ర కలిగిన సంప్రదాయం.
ఈ ఆనవాయితీ నిజాం రాజ్యకాలం నుంచి కొనసాగుతోంది. 1890లలో ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ బహదూర్ హయాంలో భద్రాచలం దేవస్థానానికి ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధులు పంపించి పట్టువస్త్రాలు సమర్పించటం మొదలైంది. ఇది కేవలం పరిపాలన పరంగా మాత్రమే కాదు, మత సామరస్యానికి ప్రతీకగా కూడా అభివృద్ధి చెందింది. కుతుబ్ షాహీ రాజవంశం నుంచే ఈ సంప్రదాయం మొదలై, నిజాం వారసత్వం గుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు సాగి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ద్వారా కొనసాగుతోంది.
An official delegation of #Hyderabad state in 1890s presenting offerings to #Bhadrachalam temple on behalf of Nizam VI. The tradition started with the Qutub Shahis and continues even today by Telangana govt. #SriRamNavami pic.twitter.com/QMPcnXLhJl
— Syed Akbar (@SyedAkbarHYD) April 6, 2025
ఇదే కాదు – భద్రాచలానికి నిజాం నవాబులు ఇచ్చిన మద్దతు దాదాపు విశ్వాసాలకు అతీతంగా ఉంది. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వయంగా ఆలయ అభివృద్ధికి రూ.29,999 విరాళంగా ఇచ్చిన చారిత్రక ఆధారాలున్నాయి. ఇది ఆ కాలంలో ఓ భారీ మొత్తం. ఆయన హిందూ దేవాలయాలకే కాదు, ఇతర మతాలకు చెందిన సంస్థలకూ విరాళాలు ఇచ్చిన ఉదారవాది.
అంతకుముందు కాలంలో భక్త రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న భద్రాచలం ఆలయ నిర్మాణానికి ప్రజాధనాన్ని వినియోగించడంతో గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానాషా చేత ఖైదు అయ్యాడు. తీరా శ్రీరాముడే బంగారు నాణేల రూపంలో రుణం తీర్చాడు అన్నది పురాణకథనం. ఆ తర్వాత నవాబు గోపన్నను విడుదల చేసి ఆలయానికి గ్రామాలను దానం చేశాడన్న చరిత్ర ఉంది.
ఈ సంప్రదాయం ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగినట్లే, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అధికారికంగా మంత్రులు, ముఖ్యమంత్రులు పట్టువస్త్రాలు సమర్పించే విధానం కొనసాగుతోంది. మత భేదాలు లేకుండా ఈ సంప్రదాయానికి ప్రభుత్వం ఆదరణ చూపడం, భద్రాచలం రాములవారి విశిష్టతను చాటిచెప్పే అంశం.