Asia Cup Final 2025 : భారత్ vs పాకిస్తాన్.. 41 ఏళ్లలో తొలిసారి ఆసియా కప్ ఫైనల్

ఆసియా కప్ 2025 ఫైనలిస్టులు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 28, ఆదివారం జరుగనున్న ఫైనల్లో టీమ్‌ఇండియా (Team India), పాకిస్తాన్ (Pakistan) తలపడనున్నారు. 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమ్ ఇండియా అజేయంగా కొనసాగుతోంది. గ్రూప్ దశలో పాకిస్తాన్‌పై రెండు విజయాలు, సూపర్ 4లో కూడా విజయాన్ని సాధించి ఫైనల్‌కు చేరింది. కాగా, గతంలో టీ20 వరల్డ్ కప్ 2007, ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్లో భారత్, పాక్ జట్లు కలిసినప్పటికీ ఇలాంటి ఫైనల్ సమరం తొలిసారి జరుగుతున్నది.

పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 20 ఓవర్లలో 135/8 రన్స్ చేసింది. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో మహమ్మద్ హారిస్ (31), షాహీన్ అఫ్రిదీ (19), నవాజ్ (25) పరుగులతో జట్టును ఆదుకున్నారు. బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ 3 వికెట్లతో ప్రదర్శన సత్తా చూపించారు.

136 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 9 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. షాహీన్ అఫ్రిది (3/17), రవూఫ్ (3/33), సైమ్ అయూబ్ (2/16) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ను ఓడించారు. షమిమ్ (30) మాత్రమే పోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.

ఫైనల్‌కు చేరిన భారత జట్టు సూపర్-4లో శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చూపుతున్న భారత జట్టు పాక్‌తో తుది పోరుకు ముందు ఫీల్డింగ్‌లో వైఫల్యాలను అధిగమించాల్సి ఉంది. మరోవైపు రెండు మ్యాచ్‌లలో ఓడిన శ్రీలంక నుంచి ఎలాంటి పోటీ ఎదురవుతుందో చూడాలి. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మొదలవుతుంది.

Leave a Reply