MLC Kavitha: కవిత సంచలన వ్యాఖ్యలు.. కాళేశ్వరం కేసులో హరీశ్ రావే అసలు దొంగ!

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో BRS ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావుపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి హరీశ్ రావే చేశారని, అందుకే ఆయన్ని ఇరిగేషన్ మినిస్టర్‌గా తొలగించారని కవిత వ్యాఖ్యానించారు. హరీశ్ రావు, సంతోష్ రావుల వల్ల కేసీఆర్‌పై అవినీతి మరకలు పడుతున్నాయని ఆమె అన్నారు. ఆ అవినీతి “అనకొండల”పై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.

కేసీఆర్‌కి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్న వారి పేర్లు మొదటిసారిగా బహిర్గతం అవుతున్నాయంటూ కవిత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో స్వార్థ ప్రయోజనాల కోసం హరీశ్ రావు, సంతోష్ రావులు అవినీతి చేశారని ఆరోపించారు. వారి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని కూడా కవిత ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పైనే దాడులు చేస్తోందని, వరదలు వస్తే ప్రజలకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉందని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఆరు నెలల ముందే యూరియా కోసం రైతులను అలర్ట్ చేసేవారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మేడిగడ్డ ఒక చిన్న భాగమని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పెద్ద సమస్యలా చూపిస్తోందని అన్నారు.

“కేసీఆర్ తెలంగాణకు నీళ్లు తేవడానికి ఏడు నెలలపాటు పరిశోధన చేశారు. ఆయనకు తిండి, డబ్బు ధ్యాస ఎప్పుడూ ఉండదు. కానీ ఇప్పుడు మా నాన్నపై ఆరోపణలు వేస్తున్నారు” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రజలు 200 ఏళ్ళపాటు గుర్తుంచుకుంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తే తాను మౌనంగా ఉండనని, కఠినంగా ఎదుర్కుంటానని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ పేరుతో టైమ్ పాస్ చేస్తోందని ఆమె అన్నారు. “రేవంత్ రెడ్డికి కేసీఆర్ పేరు చెప్పకపోతే పేపర్లలో ఫోటో రాదు. కానీ సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటపడతారు” అని కవిత నమ్మకం వ్యక్తం చేశారు.

Leave a Reply