Allu Arjun: వైఎస్ జగన్ కి థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ట్వీట్!

అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. దీనిపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించి, ట్వీట్ ద్వారా జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

“థ్యాంక్యూ జగన్ గారు! మీ మంచి మాటలు, సపోర్ట్ కి మేము నిజంగా కృతజ్ఞులం” అని బన్నీ ట్వీట్ చేశారు.

దివంగత సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నానమ్మ అయిన అల్లు కనకరత్నమ్మ గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమె కన్నుమూశారు. ఈ వార్త తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి, అల్లు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

“దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతి చెందడం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఇకపోతే, పుష్ప ఫ్రాంచైజీతో పాన్ ఇండియా హిట్ సాధించిన అల్లు అర్జున్, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. #AAA6 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించబోతున్నారని సమాచారం. బన్నీ మేకోవర్ కూడా కొత్తగా, ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్నారు. జవాన్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అట్లీ నుంచి వస్తోన్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Leave a Reply