ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.249ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం బుధవారం (ఆగస్టు 20) నుంచి అమల్లోకి వస్తుంది.
ఇప్పటికే జియో తన 1 జీబీ డేటా ప్లాన్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడవడం గమనార్హం. దీంతో వొడాఫోన్ ఐడియా కూడా త్వరలో ఇదే దిశగా అడుగులు వేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటివరకు ఎయిర్టెల్ రూ.249 ప్లాన్లో 24 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ డేటా + అపరిమిత కాల్స్ అందించేది. అయితే ఈ ప్యాక్ను తొలగించడంతో ఇకపై వినియోగదారులు కనీసం రూ.319 ప్లాన్కు మారాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా మాత్రం రూ.299కు రోజుకు 1 జీబీ డేటా అందిస్తోంది. అయితే అది కూడా త్వరలో నిలిపివేయొచ్చని చెబుతున్నారు. జియో విషయానికి వస్తే-ఇప్పటికే రూ.299 (రోజుకు 1.5 జీబీ డేటా) మరియు రూ.349 (రోజుకు 2 జీబీ డేటా) ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఈ మార్పుల వల్ల వినియోగదారులు ఇకపై కనీసం రోజుకు 1.5 జీబీ డేటా అందించే ప్లాన్లను మాత్రమే ఎంచుకోవాలి. దీంతో టెలికాం కంపెనీల సగటు ఆదాయం (ARPU) 4-7 శాతం వరకు పెరుగుతుందని అంచనా. జియో యూజర్లలో 20-25 శాతం మంది, ఎయిర్టెల్ యూజర్లలో 18-20 శాతం మంది మాత్రమే ఎంట్రీ లెవల్ ప్లాన్ వినియోగదారులు ఉన్నారు. కాబట్టి ఈ మార్పుల వల్ల ఆయా సంస్థలకు ప్రతి యూజర్పై సగటున రూ.10-13 వరకు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
