ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు 2025 కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆగస్టు 1న ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. అభ్యర్థులు https://slprb.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు.
రిజల్ట్స్ చూసేందుకు అభ్యర్థులు తమ రోల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అయి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల కాపీని ప్రింట్ తీసుకోవాలని అధికారులు సూచించారు. ఫైనల్ రిజల్ట్స్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు త్వరలో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్లు నిర్వహించనున్నారు. దీంతో వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుపై స్పష్టత లభించింది.
మొత్తం 6,100 పోస్టులు భర్తీకి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) 2025 సంవత్సరానికి సంబంధించి మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 3,580 సివిల్ కానిస్టేబుల్, 2,520 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి.
దశల వారీగా ఎంపిక ప్రక్రియ
ఈ రిక్రూట్మెంట్ పలు దశలుగా జరిగింది. మొదట ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, అర్హత సాధించినవారికి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) జరిగాయి. ఈ టెస్టులు 2024 డిసెంబర్ 30 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు నిర్వహించబడ్డాయి. అనంతరం, తుది రాత పరీక్షను 2025 జూన్ 1న నిర్వహించారు. తాజాగా విడుదలైన ఫలితాలతో తుది ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది.
భారీగా దరఖాస్తులు – తక్కువ మంది ఎంపిక
ఈ రిక్రూట్మెంట్కు 5,03,486 మంది అభ్యర్థులు అప్లై చేశారు. వారిలో 4,59,182 మంది ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయగా.. 95,208 మంది అర్హత సాధించారు. తుది రాత పరీక్షకు 37,600 మంది హాజరై, అందులో 33,921 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.