ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు డీఎస్పీల మృతి

తెలంగాణలోని చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కి వస్తున్న ఏపీ పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డీఎస్పీ చక్రధరరావు, శాంతారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్‌కి తీవ్ర గాయాలు కాగా, కారు డ్రైవర్ నర్సింగ రావు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం స్థానికులను కలచివేసింది.

Leave a Reply