సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి షాకింగ్ ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి, ఒక హీరోయిన్ను బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ భూజాకు పిలిచారని, ఆమె కోసం అర్ధరాత్రి 2 గంటలకు అక్కడికి వెళ్లారని తెలిపారు. ఆ రాత్రి ఏం జరిగిందో రేవంత్కే తెలుసు అని చెప్పి, త్వరలోనే అన్ని ఆధారాలను బయటపెడతానని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
తాను కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వ్యక్తినని, రేవంత్ రెడ్డి గతం మొత్తం తనకు తెలుసునని కౌశిక్ రెడ్డి అన్నారు. దుబాయ్లో రేవంత్ ఏం చేసేవాడో కూడా తనకు తెలుసన్నారు. అంతేకాకుండా, తన భార్య ఫోన్ను కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేశాడని, భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలు విన్నాడని సంచలనంగా ఆరోపించారు. ఢిల్లీలో రేవంత్ మీడియా చిట్చాట్లో ఫోన్ ట్యాపింగ్ సాధారణమని అన్న మాటలను గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లనే నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఎవరెవరితో తిరిగావో ఆ 16 మంది పేర్లు బయటపెడతా
నువ్వు జూబ్లీహిల్స్లో ఎక్కడ పడుకున్నావో, దుబాయిలో ఎక్కడ పడుకున్నావో, ఢిల్లీలో ఎక్కడ పడుకున్నావో నాకు అన్నీ తెలుసు
రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్… pic.twitter.com/YQHZLDADTO
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2025
ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమని, రేవంత్ రెడ్డిపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 118 మంది ఫోన్లను రేవంత్ ట్యాప్ చేస్తున్నాడని ఆరోపించారు. తాను చేస్తున్న ఆరోపణలపై రేవంత్ తనపై కేసులు పెట్టవచ్చని తెలుసునని, కానీ ఎన్ని కేసులు పెట్టినా తాను వెనక్కి తగ్గేది లేదని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.