Raja Singh: డమ్మీ కాదని నిరూపించుకోండి.. బీజేపీ చీఫ్‌కు రాజాసింగ్ ఛాలెంజ్!

తెలంగాణ బీజేపీలో తిరుగుబాటు స్వరం గట్టిగా వినిపిస్తోంది. హైదరాబాదు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు బహిరంగంగా ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ అంశంపై ఛాలెంజ్ విసిరారు.

రాజాసింగ్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. “మీరు డమ్మీ కాదు మమ్మీ, డాడీ అని చెబుతున్నారు కదా.. అయితే మీరు నిజంగా బీజేపీ అధ్యక్షులైతే, ఫాతిమా కాలేజ్ కూల్చేందుకు లీగల్ టీమ్ ఏర్పాటు చేయండి. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి,” అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పుడు బీజేపీ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఫాతిమా కాలేజ్ ఓవైసీ కుటుంబానికి చెందినదని, అది అనధికార నిర్మాణమని పలుమార్లు ఆరోపణలు వచ్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాజాసింగ్ ప్రశ్నించారు.

“పేదల ఇళ్ళను హైడ్రా కూలుస్తోంది. కానీ ఫాతిమా కాలేజ్‌ మీద మాత్రం మౌనం ఎందుకు? పేదలకు ఒక న్యాయం.. ఓవైసీకి మరో న్యాయమా?” అని మండిపడ్డారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కూడా రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. “ఫాతిమా కాలేజ్ కూల్చే ధైర్యం మీకు ఉందా?” అంటూ నిలదీశారు.

ఇటీవలి కాలంలో బీజేపీ తెలంగాణలో నాయకుల మధ్య విభేదాలు, బహిరంగ వ్యాఖ్యలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా రాజాసింగ్ తరచూ పార్టీ అధిష్టానంపై నేరుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజా వీడియోతో తెలంగాణ బీజేపీ లో దుమారం రేగే అవకాశం ఉంది.

Leave a Reply