టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ గురించి ఎంతకాలంగా ఎదురుచూస్తున్నారో అభిమానులకు తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు గంగూలీగా కనిపించబోతున్న సంగతి ఇప్పటికే బయటకు వచ్చింది.
తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన గంగూలీ, తన బయోపిక్ షూటింగ్ గురించి కీలక సమాచారం ఇచ్చాడు. 2026 జనవరిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించాడు. ప్రీ-ప్రొడక్షన్, స్క్రిప్టింగ్, కథ రచన కోసం ఎక్కువ సమయం పడుతుందని, షూటింగ్ మాత్రం తక్కువ టైమ్లో పూర్తి అవుతుందని ఆయన తెలిపారు.
ఈ సినిమాకు విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించనుండగా, నిర్మాతగా లవ్ రంజన్ వ్యవహరిస్తున్నారు.
భారత జట్టులో పోరాట స్ఫూర్తిని నింపిన గంగూలీ, విదేశాల్లో విజయాలను అందించిన కెప్టెన్గా పేరుగాంచారు. ఆయన 49 టెస్టులకు నాయకత్వం వహించగా, అందులో 21 గెలుపులు, 13 ఓటములు, 15 డ్రాలు నమోదయ్యాయి. ప్రత్యేకంగా విదేశాల్లో 11 విజయాలతో అత్యధిక విదేశీ గెలుపులు అందించిన కెప్టెన్గా రికార్డు సృష్టించారు. ఈ రికార్డును తరువాత విరాట్ కోహ్లీ అధిగమించాడు.
గంగూలీ తన అంతర్జాతీయ కెరీర్లో 38 శతకాలు బాదాడు. కానీ.. “ఇంకా ఎన్నో సెంచరీలు చేయాల్సి ఉంది” అని ఆయన అభిప్రాయపడ్డాడు. తన కెరీర్లో 30 సార్లు 80ల్లో, 90ల్లో ఔట్ అయ్యానని, అవన్నీ సెంచరీలయ్యుంటే 50కి పైగా శతకాలు పూర్తయ్యేవని చెప్పారు.
ఒంటరిగా ఉన్నప్పుడు తన పాత ఇన్నింగ్స్నే చూస్తుంటానంటూ ముచ్చటపడ్డ గంగూలీ, “70ల్లో ఔట్ అయ్యానే? సెంచరీ అయితే బాగుండేది కదా! కానీ ఇప్పుడది మార్చలేం” అంటూ చిరునవ్వుతో తను మిస్ అయిన సెంచరీలపై వ్యాఖ్యానించారు.