ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న సింగయ్య అనే వృద్ధుడి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగగా, సింగయ్య భార్య లూర్ధు మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ సీఎం జగన్ను సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
జూన్ 18న పల్నాడు జిల్లా రెంటచింతలలో జగన్ పర్యటనకు వెళ్తుండగా, గుంటూరులోని ఏటుకూరు బైపాస్ వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జగన్ కాన్వాయ్లో ఉన్న వాహనాల్లో ఒకటి సింగయ్యను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తేలింది. గాయాలపాలైన సింగయ్యను ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు కాపాడలేకపోయారు.
పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద వృద్ధుడు పడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించిందని ఎస్పీ వెల్లడించారు. దీంతో సంబంధిత సెక్షన్లను మార్చి, BNS 106(1), 105, 49 కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి కేసు నోట్లో చేర్చిన నిందితులు:
రమణా రెడ్డి – డ్రైవర్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి – మాజీ ముఖ్యమంత్రి
కే. నాగేశ్వర్ రెడ్డి – పీఏ
వైవి సుబ్బారెడ్డి – మాజీ ఎంపీ
పేర్ని నాని (వెంకటేశ్వరరావు) – మాజీ ఎమ్మెల్యే
విడదల రజిని – మాజీ మంత్రి
అనుమతించబడిన 3 వాహనాల బదులు తాడేపల్లి నుంచి 50 వాహనాలు బయలుదేరడం కూడా చట్ట విరుద్ధమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో అన్ని టెక్నికల్ ఆధారాలతో కలిపి పూర్తి విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని గుంటూరు ఎస్పీ స్పష్టం చేశారు.