బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ‘‘ఇప్పటివరకు సింహా పేరుతో సినిమాలు చేశాను.. కానీ ఇప్పుడు వైద్యారోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ పేరుతో ఓ సినిమా తీయాలని ఉంది’’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
ఈ ఆసుపత్రి 25 సంవత్సరాల పాటు అనేక మంది సహకారంతో అభివృద్ధి చెందిందని, 2000లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ హాస్పిటల్ ఇప్పుడు ప్రజలకు గొప్ప సేవలందిస్తోందని బాలకృష్ణ తెలిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లోనూ వెయ్యి పడకలతో ఒక సరికొత్త హాస్పిటల్ నిర్మించనున్నట్లు కూడా వెల్లడించారు.
సిల్వర్ జూబ్లీ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, వైద్యారోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ, విశాఖ ఎంపీ శ్రీ భరత్, నారా బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. ‘‘ఈ హాస్పిటల్ ఎంతో గొప్ప వ్యక్తి, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు ఎన్టీఆర్ కల. ఆయన్ను గుర్తుచేసుకుంటే ప్రతి ఒక్కరికి స్పూర్తి లభిస్తుంది. బాలకృష్ణ నిస్వార్థంగా సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తి. కుల, మత, ఆర్థిక భేదాలు లేకుండా అందరికీ హాస్పిటల్ సేవలు అందించడమంటే ఎంతో గొప్పదనం’’ అని కొనియాడారు.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎన్టీఆర్ దంపతుల ఆశయాలకు ప్రతీక అని, ఆ మహోన్నత లక్ష్యాన్ని నెరవేర్చేందుకు బాలకృష్ణ చేస్తున్న కృషిని పలువురు నేతలు, హాజరైన అతిధులు ప్రశంసించారు.