ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ లేఆఫ్స్కు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో పెట్టుబడులు పెరగడంతో, కంపెనీ ఆర్థిక వ్యయాలను సమతుల్యం చేయాలనే ఉద్దేశంతో వేలాది ఉద్యోగాలను తొలగించేందుకు ప్రణాళిక వేస్తోంది.
బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం, ఈసారి ముఖ్యంగా సేల్స్ డిపార్ట్మెంట్లో భారీగా ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటన చేయనుంది. అయితే ఒక్కసారిగా తొలగింపులు జరిపే బదులు, ఈ ఏడాది చివరి వరకూ దశల వారీగా లేఆఫ్స్ చేపట్టే అవకాశం ఉంది. సేల్స్తోపాటు ఇతర విభాగాల్లో కూడా కొందరిని ఉద్వాసనకు గురిచేయనున్నట్లు సమాచారం.
ఇది మైక్రోసాఫ్ట్ చేసిన తొలి లేఆఫ్స్ కాదు. మే 2024లో కంపెనీ సుమారు 6,000 ఉద్యోగాలను తొలగించింది. తాజా లేఆఫ్స్ కూడా అదే స్థాయిలో ఉండే అవకాశముందని బ్లూమ్బర్గ్ అంచనా వేస్తోంది.
ఏఐపై భారీ పెట్టుబడుల దిశగా మైక్రోసాఫ్ట్
AI రంగంలోని వేగవంతమైన మార్పులు, మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మైక్రోసాఫ్ట్ తన వ్యూహాలను మార్చుకుంటోంది. డేటా సెంటర్ల విస్తరణ, AI పరిశోధన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం భారీగా మూలధనాన్ని ఖర్చు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 6.6 లక్షల కోట్ల వరకు మూలధన వ్యయం ఉంటుందని కంపెనీ అంచనా వేసింది. ఇందులో మెజారిటీ భాగం డేటా సెంటర్ల నిర్మాణానికి వెళ్తుంది.
2023 జూన్ నాటికి మైక్రోసాఫ్ట్కి ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా లేఆఫ్స్ ప్రక్రియ అనంతరం ఈ సంఖ్యలో మరింత కోత పడే అవకాశం కనిపిస్తోంది.