దుర్గం చెరువులో యువతి ఆత్మహత్య.. మాదాపూర్‌లో విషాదం

హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.

సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన సుష్మ (27), మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. బుధవారం రోజు ఆమె ఉద్యోగం అయ్యాక ఇంటికి చేరకపోవడంతో, తండ్రి అంజయ్య ఆందోళన చెందారు. వెంటనే ఆమె ఆఫీస్ మేనేజర్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగారు.

మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం సుష్మ రాత్రి 10:30 గంటలకే ఆఫీసు నుండి బయటకు వెళ్లింది. అనంతరం బంధువుల ఇళ్లలో, స్నేహితుల వద్ద వెతికినప్పటికీ ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో సుష్మ తండ్రి తెల్లవారుజామున 4 గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అదే రోజు ఉదయం 7 గంటల సమయంలో దుర్గం చెరువులో మహిళ మృతదేహం తేలుతుందని గుర్తించి సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెలికితీసిన మృతదేహాన్ని సుష్మదిగా గుర్తించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుష్మ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply