తెలంగాణకు సంబంధించి కీలక జలవివాదమైన బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో కేంద్రం తటస్థంగా వ్యవహరించకపోతే, లీగల్ ఫైట్కు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు.
సచివాలయంలో బుధవారం జరిగిన అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని సహా కేంద్ర నేతలతో కలిసి మాట్లాడతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
“రైతుల ప్రయోజనాలే మా ప్రభుత్వానికి ప్రాధాన్యం. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా ముందుకెళ్లాలి” అని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, తెలంగాణ హక్కుల కోసం మాత్రమే అని రేవంత్ పేర్కొన్నారు.
నీటి వాటాలో తెలంగాణ హక్కులు కాపాడుకోవడంలో ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజకీయంగానే కాకుండా చట్ట పరమైన పోరాటం కూడా చేస్తామని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జల… pic.twitter.com/RNf65FV6o1
— Telangana CMO (@TelanganaCMO) June 18, 2025
గత ప్రభుత్వంపై సీఎం విమర్శలు:
2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో, ఆనాటి సీఎం కేసీఆర్ గోదావరి నదిలోకి ఏడాదికి 3,000 టీఎంసీల జలాలు కలుస్తున్నాయంటూ ప్రతిపాదన చేశారు.
ఆ సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారని రేవంత్ గుర్తు చేశారు.
2019 ఆగస్టు 13న “రాయలసీమను రతనాల సీమగా మార్చుతాం” అని కేసీఆర్ చేసిన ప్రకటనను గుర్తు చేశారు.
కెసీఆర్ – జగన్ నాలుగు సార్లు ప్రగతి భవన్లో సమావేశమై గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
ఈ సమావేశాల వివరాలను ఆ సమయంలో ఈటెల రాజేందర్, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ మీడియాకు వివరించారని గుర్తు చేశారు.
ఈ వివరాలను ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్లను తెలంగాణకు గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
మొత్తంగా చూస్తే, జలవనరుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే కచ్చితంగా పోరాటం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.