YS Sharmila: ఫోన్ ట్యాపింగ్‌పై షర్మిల సంచలన ఆరోపణలు.. ఆయనే వచ్చి నాకు వినిపించారు..!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ట్యాపింగ్ జరిగిన సంగతి ముమ్మాటికీ నిజమేనని, ఈ వ్యవహారంలో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా సంబంధం ఉందని ఆరోపించారు.

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడిన షర్మిల మాట్లాడుతూ, “2018-19లో రాజకీయ పరంగా కేసీఆర్, జగన్ చాలా సన్నిహితంగా ఉన్నారు. ఆ సంబంధం రక్త సంబంధం కంటే గట్టిగా ఉంది. నా ఫోన్‌తో పాటు నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని నాకు స్పష్టంగా అర్థమైంది. వైవీ సుబ్బారెడ్డి స్వయంగా వచ్చి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పారు. ఆయనే నా ఫోన్ సంభాషణను వినిపించారు. ఈ విషయాన్ని ఆయన బయటికి ఒప్పుకుంటారా అన్నది మరో ప్రశ్న” అని అన్నారు.

“ఫోన్ ట్యాపింగ్ జరిగిన సంగతి నాకు అప్పుడే తెలిసింది. కానీ అప్పట్లో ప్రభుత్వాల దురాచారాల మధ్య ఇది తక్కువగా కనిపించింది. పైగా నా రాజకీయ భవిష్యత్‌నే ధ్వంసం చేయాలని ఈ కుట్ర జరిగిందని నమ్ముతున్నాను. నాకు అండగా ఉన్నవాళ్లను బెదిరించారు. జగన్ మోహన్ రెడ్డి వల్ల నాకు ఊపిరి తీసుకోవడమే కష్టంగా అయ్యింది” అని షర్మిల ఆరోపించారు.

తాను ఏదైనా విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. “బైబిల్ మీద, నా పిల్లల మీద ప్రమాణం చేస్తూ మాట్లాడగలను. ఫోన్ ట్యాపింగ్ నిజం. అప్పట్లో చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు పోరాటానికి సిద్ధం. పూర్తి స్థాయిలో విచారణ జరగాలి” అని డిమాండ్ చేశారు.

Leave a Reply