చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి బలవంతంగా కొట్టిన దృశ్యాలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి బాధితురాలి కుటుంబానికి ఆర్థికంగా తోడుగా నిలిచారు.
బాధితురాలు శిరీషతో స్వయంగా ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు.. ఘటన వివరాలను తెలుసుకుని ఆమె బాధను నేరుగా విన్నారు. ఈ సందర్భంగా ఆమె గతంలోనూ పలు వేధింపులకు గురైనట్లు వెల్లడించడంతో, సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం కోల్పోయి ఇటువంటి కిరాతకంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
శిరీష కుటుంబ పరిస్థితి తెలుసుకున్న చంద్రబాబు.. వెంటనే రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆమె ముగ్గురు పిల్లల చదువు భాద్యతను ప్రభుత్వం తానే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. “మీరు ధైర్యంగా ఉండండి.. ప్రభుత్వం మీతో ఉంది,” అంటూ భరోసా కలిగించారు.
ఎంత దారుణ సిట్యుయేషన్ లో ఉంది రా AP
80 వేలు అప్పు తీర్చిలేదు అని 5 సంవత్సరాల చిన్న పిల్లాడి ముందు భర్త లేని ఒంటరి మహిళని చెట్టుకి కట్టేసి కొడతారా?అది కూడా CM సొంత నియోజకవర్గం కుప్పం లో pic.twitter.com/WUXP0NAvwF
— వరదరాజ్ మన్నార్ (@VARADHA151) June 17, 2025
ఈ దారుణ ఘటనపై పూర్తిగా సమాచారం తీసుకురావాలని, బాధిత కుటుంబానికి అవసరమైన ప్రతి సహాయం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. ఈ చర్యతో బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందనుంది. అలాగే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.