పెట్రోల్ బంక్‌లో తుపాకీతో యువతి రచ్చ.. ‘చంపేస్తా’ అంటూ బెదిరింపులు..!

ఉత్తరప్రదేశ్‌ హర్దోయ్ జిల్లాలో ఓ యువతి తుపాకీతో రెచ్చిపోయి పెట్రోలు బంక్ సిబ్బందిని బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. జూన్ 15 సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీసుల దృష్టికి ఘటన చేరడంతో కేసు నమోదైంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్దోయ్‌లోని ఓ సీఎన్‌జీ స్టేషన్ వద్ద ఒక కుటుంబం కారులో వచ్చి రీఫిల్ చేయించేందుకు చేరింది. భద్రతా నిబంధనల ప్రకారం కారులో ఎవరూ లేకుండా మాత్రమే రీఫిల్ చేయాల్సి ఉంటుందనడంతో, సిబ్బందిలోని రజనీష్ కుమార్ కారులో కూర్చున్న ఎహ్సాన్ ఖాన్ కుటుంబాన్ని బయటికి రావాలని కోరాడు. కానీ వారు నిరాకరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ సమయంలో ఎహ్సాన్ ఖాన్ కుమార్తె అరీబా తీవ్ర ఆగ్రహానికి గురై కారులో నుంచి రివాల్వర్ తీసుకుని ఉద్యోగిపై లక్ష్యంగా పెట్టింది. “ఇన్ని బుల్లెట్లు తగులుతాయ్.. నీ కుటుంబం నిన్ను అస్సలు గుర్తించలేరు” అంటూ బెదిరింపులు కూడా చేసింది.

అయినా ఉద్యోగి రజనీష్ ధైర్యంగా వ్యవహరించాడు. చివరికి బంక్ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో అరీబాను ఆమె తల్లి కారు వైపుకు తీసుకెళ్లింది. ఈ మొత్తం ఘటన సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది.

రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. అరీబా, ఆమె తండ్రి ఎహ్సాన్ ఖాన్, భర్తపై కేసు నమోదు చేశారు. అరీబా వద్ద లైసెన్సు ఉన్న రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఆయుధ లైసెన్స్ చెల్లుతుందా లేదా అనేదానిపై దర్యాప్తు జరుగుతోంది.

ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. పెట్రోలు బంక్‌లలో సిబ్బంది భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Leave a Reply