విమాన ప్రమాదంలో కుటుంబసభ్యులను కోల్పోయిన వారి బాధను తాను పూర్తిగా అర్థం చేసుకోవటం జరుగుతోందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. “ప్రమాదంలోనే నా తండ్రిని కోల్పోయాను. ఆ బాధ నాకు తెలుసు. బాధిత కుటుంబాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంటుంది,” అని ఢిల్లీలో మీడియా సమావేశంలో భావోద్వేగంగా స్పందించారు.
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఘటనపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించిందని తెలిపారు. ప్రమాదం తర్వాత వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయని, మంటల్ని అదుపులోకి తీసుకువచ్చి మృతదేహాలను తరలించామని వివరించారు.
ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని, అవసరమైతే ఇంకా సభ్యులను చేర్చే అవకాశం ఉందని వెల్లడించారు. “ఘటనాస్థలంలో బ్లాక్ బాక్స్ను రికవర్ చేశాం. నిపుణులు దానిపై విశ్లేషణ చేస్తున్నారు. విచారణ పూర్తయ్యాక అన్ని వివరాలను మీడియాకు తెలియజేస్తాం. తప్పు ఎవరిదో తేలిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం,” అని తెలిపారు.
Addressed the media today regarding the tragic Ahmedabad plane crash. pic.twitter.com/3IKxFJuji0
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 14, 2025
బోయింగ్ 787 సిరీస్కి చెందిన విమానాల భద్రతపై సమీక్ష జరిపినట్టు తెలిపారు. మొత్తం 34 విమానాల్లో 7 విమానాలను ప్రత్యేకంగా తనిఖీ చేసినట్టు పేర్కొన్నారు. “ఈ ప్రమాదం తర్వాత బోయింగ్ విమానాలపై నిరంతర తనిఖీలు జరిపేలా ఆదేశాలు జారీ చేశాం,” అని చెప్పారు.
విమానయాన శాఖ కార్యదర్శి కూడా మీడియాతో మాట్లాడుతూ.. “విమానం టేకాఫ్ అనంతరం కేవలం 2 కిలోమీటర్ల ప్రయాణంలోనే, సుమారు 650 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు కూలిపోయింది. పైలట్ నుండి ‘మే డే’ కాల్ అందినా, ఏటీసీ స్పందించలేకపోయింది. సహాయ బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని పని ప్రారంభించాయి. సాయంత్రం 6 గంటల వరకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి” అని తెలిపారు.