విమాన ప్రమాదంపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్పందన.. సంఘటనపై దిగ్భ్రాంతి

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు స్పందించారు. ఈ విషాద ఘటన తమను పూర్తిగా షాక్‌కు గురి చేసిందని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కోసం ప్రార్థనలు చేస్తున్నామని, వారి కుటుంబాలకు తన గాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఈ ప్రమాదంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన రెండు నిమిషాల్లోనే విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఘటనాస్థలంలో నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేయగా, చుట్టుపక్కల అరుపులు, గందరగోళం అలుముకున్నాయి.

ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు. అందులో 229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం కూలిన ప్రాంతంలో ఒక మెడికల్ హాస్టల్ ఉండటంతో అక్కడి విద్యార్థుల్లో 24 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో కేవలం ఒకరే ప్రాణాలతో బయటపడగలిగారు.

విరాట్ కోహ్లీ స్పందన:
‘‘అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద వార్త విని నేను పూర్తిగా షాక్‌కి లోనయ్యాను. ఈ ఘటన బాధాకరం. బాధితుల కోసం ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను,’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించారు విరాట్ కోహ్లీ.

రోహిత్ శర్మ స్పందన:
‘‘అహ్మదాబాద్‌ నుండి చాలా విషాదకరమైన వార్త. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ వార్త విని నేను ఎంతగానో బాధపడ్డాను’’ అంటూ రాశారు రోహిత్ శర్మ.

ఇతరుల స్పందన:
ఈ ప్రమాదంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ కూడా తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply