Air India Flight Crash: మెడికల్ హాస్టల్‌పై కూలిన విమానం.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. స్థానిక బీజే ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో హాస్టల్‌లో ఉన్న 20 మంది పీజీ మెడికల్ విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో భోజన సమయంగా ఉండటంతో మెస్‌లో ఉన్న విద్యార్థులు భారీగా ప్రాణాలు కోల్పోయారు.

ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1:38 గంటలకు తిరిగి టేకాఫ్ అయింది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే 1:43కి మేఘానీనగర్ ఘోడాసర్ క్యాంప్ సమీపంలో చెట్టును ఢీకొని కుప్పకూలింది. కూలే ముందు పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఎమర్జెన్సీ సమాచారం అందించినప్పటికీ స్పందనకు ముందే ఘటన జరిగింది.

విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 మంది పోర్చుగీస్ దేశస్థులు, ఒకరు కెనడియన్ ఉన్నారు. 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు కూడా ప్రయాణిస్తున్నారు. పైలట్లు సుమిత్ సబర్వాల్‌, క్లేవ్ కుందర్ కాగా, 10 మంది సిబ్బంది కూడా ఉన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అహ్మదాబాద్‌కు వెళ్లాల్సిందిగా ప్రధాని మోదీ ఆదేశించారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారిక సమాచారం మేరకు ఇప్పటికే 40 మృతదేహాలు ఆసుపత్రికి తరలించబడ్డాయి. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

Leave a Reply