Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. 242 మందితో కూలిన ఫ్లైట్..!

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలో ఈ రోజు ఓ పెద్ద విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్ విమానం మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో టేకాఫ్ సమయంలో చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

విమానంలో పెద్ద మొత్తంలో ఇంధనం ఉండటం వల్ల మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. సంఘటనాస్థలానికి వెంటనే ఫైరింజన్లు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. మొత్తం ఏడు ఫైరింజన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. పొగ దట్టంగా ఉండటంతో సహాయక చర్యలకు కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌ వెళ్లే దశలో టేకాఫ్ అవుతుండగా మధ్యాహ్నం 1.39 గంటల సమయంలో 825 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే చెట్టును ఢీకొన్నట్లు అధికారులు ప్రాథమికంగా తెలిపారు.

ఇక ఈ ప్రమాద సమయంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రుపానీ కూడా విమానం లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి సమాచారం తీసుకున్నారు.

ప్రమాదానికి సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రమాద తీవ్రత, ప్రాణనష్టం, గాయపడిన వారి వివరాలపై మరింత సమాచారం త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply