హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ) కాలనీలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను వేలం ద్వారా విక్రయించిన అధికారులు రికార్డు స్థాయి ఆదాయాన్ని పొందారు. ఈ వేలంలో గజానికి ధరలు ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా నమోదయ్యాయి.
హైటెక్ సిటీ ప్రధాన రహదారికి దగ్గరగా ఉండే ఫేజ్-7లోని 18 ఖాళీ ప్లాట్లను బుధవారం బహిరంగంగా వేలం వేశారు. వీటిలో 151.92 గజాల 10వ నెంబర్ ప్లాట్ గజానికి రూ.2.98 లక్షలకు అమ్ముడవడం విశేషం. ఇది ఇప్పటివరకు కూకట్పల్లిలో నమోదైన అత్యధిక ధరగా అధికారులే తెలిపారు. మొత్తం 18 ప్లాట్లలో 13 ప్లాట్లు గజానికి రూ.2 లక్షలకు మించి ధర పలికాయి. మిగతా ఐదు ప్లాట్లు మాత్రం రూ.2 లక్షల లోపే అమ్ముడయ్యాయి.
ఈ వేలంలో అత్యల్ప ధరకు అమ్ముడైన ప్లాట్ రూ.1.14 లక్షల గజం కాగా, అత్యధిక ధర పలికినది రూ.2.98 లక్షలు. మొత్తం 6,236.33 గజాల విస్తీర్ణంలోని ఈ ప్లాట్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.141.36 కోట్లు ఆదాయం సమకూరింది. వేలంలో మొత్తం 84 మంది బిడ్డర్లు పాల్గొన్నారు.
ఇటీవలి కాలంలో ప్రభుత్వ నిర్వహణలో జరిగిన ప్లాట్ల వేలాల్లో ఇది అత్యంత విజయవంతమైనదిగా పేర్కొంటున్నారు. గజానికి లభించిన ధరలు చూస్తే కేపీహెచ్బీ పరిధిలో రియల్ ఎస్టేట్కు ఎంత భారీగా డిమాండ్ ఉన్నదో స్పష్టమవుతోంది. తద్వారా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.