KCR: కేసీఆర్‌ను 50 నిమిషాల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్.. అడిగిన కీలక ప్రశ్నలు ఇవే!

తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కాళేశ్వరం కమిషన్ బుధవారం హైదరాబాద్‌ బీఆర్కే భవన్‌లో సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. విచారణ సందర్భంగా కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తన వాదనను కమిషన్‌కు వివరించారు.

విచారణ అనంతరం కేసీఆర్ బీఆర్కే భవన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం కార్యకర్తలకు అభివాదం చేసి కారులో వెళ్లిపోయారు. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఉన్నారు.

మీడియా లేకుండా జస్టిస్ పీసీ ఘోష్‌తో వన్ టు వన్ విచారణ

ఈ విచారణ పూర్తిగా మీడియా రహితంగా జరిగింది. జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్‌ను వ్యక్తిగతంగా వన్ టు వన్ విధానంలో విచారించారు. ప్రత్యేకంగా మూడు బ్యారేజీల రీడిజైన్, వాటి స్థలాల ఎంపికపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

కేసీఆర్ ఇచ్చిన సమాధానాల ప్రకారం, అన్ని నిర్మాణాలు ఇంజనీర్ల సిఫార్సులు, టెక్నికల్ నివేదికలు, వ్యాప్కోస్ సంస్థ రిపోర్టుల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలేనని తెలిపారు. మేడిగడ్డ వద్ద 230 టీఎంసీ నీటి లిఫ్టింగ్‌కు అవకాశం ఉండటం వల్ల అక్కడే బ్యారేజ్ నిర్మించామన్నారు. తుమ్మిడిహట్టి వద్ద మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్టు మార్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు.

కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై వివరణ

కేసీఆర్ మాట్లాడుతూ, అప్పట్లో కొత్త రాష్ట్రం కావడంతో నిధుల కొరత, కేంద్ర ఫండ్ల ఆలస్యం వంటి సమస్యల వల్లే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం రూ. 280 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. అన్ని అవసరమైన సర్వేలు పూర్తయ్యాయని, కేంద్ర అనుమతులన్నీ కూడా పొందామన్నారు.

115వ సాక్షిగా విచారణ

ఇప్పటి వరకు కమిషన్ మొత్తం 114 మందిని విచారించింది. కేసీఆర్‌ను 115వ సాక్షిగా నమోదు చేసింది. విచారణ అనంతరం ఆయన కమిషన్ నోట్లపై సంతకం చేసి వెళ్లిపోయారు. ఈ విచారణలో “The Life Line of Kaleswaram Project” అనే పేరుతో ఉన్న డాక్యుమెంట్‌ను కూడా ఆయన సమర్పించారు. ప్రాజెక్టులో సుమారు 4000 ఇంజనీర్లు పనిచేశారని ఆయన వివరించారు.

Leave a Reply