తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసులు మళ్లీ దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో పాపులర్ ఫోక్ సింగర్ మంగ్లీ పేరు చర్చనీయాంశమైంది. జూన్ 10న ఆమె పుట్టిన రోజు సందర్భంగా చేవెళ్ల సమీపంలోని త్రిపుర రిసార్ట్లో ఏర్పాటు చేసిన పార్టీ వివాదాస్పదమైంది.
ఈ బర్త్డే పార్టీకి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు, మంగ్లీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు.. మొత్తం 48 మంది హాజరైనట్లు సమాచారం. అయితే అర్థరాత్రి తర్వాత ఎస్ఓటీ పోలీసులు రిసార్ట్పై ఆకస్మికంగా దాడి నిర్వహించారు. దాడిలో గంజాయి, విదేశీ మద్యం, ఇతర నిషేధిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
మంగ్లీ బర్త్ డే పార్టిలో భారీగా విదేశీ మద్యం బాటిళ్లు పట్టివేత. https://t.co/3ia8u2LcY8 pic.twitter.com/1ub2MASb1M
— Telangana365 (@Telangana365) June 11, 2025
మరింతగా ఆరా తీసిన పోలీసులు 48 మందికి మెడికల్ టెస్ట్లు నిర్వహించగా, వారిలో 9 మందికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ యాక్ట్, సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మంగ్లీకి సంబంధించిన ప్రాధాన్యత ఉన్న ఈ వేడుక ఇలా వివాదాస్పదం కావడం పరిశ్రమను షాక్కు గురి చేసింది.
న్యూస్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన మంగ్లీ.. తెలంగాణ యాసతో ప్రజలను ఆకట్టుకుంది. అలా తనకున్న టాలెంట్ తో మ్యూజిక్ ఫీల్డ్ లో అడుగుపెట్టిన మంగ్లీ.. రేలారే.. రేలారే పాటతో ఒక్కసారిగా పాపులరైంది. అదే క్రేజ్ తో సినిమాల్లో కూడా పాడే అవకాశం దక్కించుకుంది. అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమాలో ‘రాములో.. రాములా’ పాటతో మంగ్లీ సింగింగ్ కెరీర్ మరింత ఊపందుకుంది.
ఇప్పటికే సినీ పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా ప్రభావం ఉందని పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో, మంగ్లీ పార్టీపై వచ్చిన ఆరోపణలు కొత్త దుమారానికి తావిస్తున్నాయి. అసలు మంగ్లీకి ఈ వ్యవహారంతో సంబంధం ఎంతవరకు ఉందో అన్నది విచారణ అనంతరం స్పష్టమవుతుంది.