టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి మంగళవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అకస్మాత్తుగా తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.
గోపిచంద్ హీరోగా వచ్చిన ‘యజ్ఞం’ సినిమాతో దర్శకుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రవికుమార్, ఆపై బాలకృష్ణతో ‘వీరభద్ర’, సాయిధరమ్ తేజ్తో ‘పిల్లా నువ్వులేని జీవితం’, గోపిచంద్తో ‘సౌఖ్యం’, నితిన్తో ‘ఆటాడిస్తా’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల రాజ్ తరుణ్ హీరోగా ‘తిరగబడరా సామీ’ సినిమాను తెరకెక్కించారు.
ప్రముఖ దర్శకులు, రవికుమార్ చౌదరి గారు గతరాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. #యజ్ఞం, #పిల్లానువ్వులేనిజీవితం వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన చివరి సినిమా #తిరగబడరాస్వామీ.
RIP 🙏 pic.twitter.com/nm7hHyIqoJ
— Rajesh Manne (@rajeshmanne1) June 11, 2025
కుటుంబానికి దూరంగా.. మానసిక ఒత్తిడిలో దర్శకుడు?
ఇటీవల ఏఎస్ రవికుమార్ చౌదరి కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారని సమాచారం. వరుసగా వచ్చిన ఫ్లాపుల తరువాత మానసికంగా ఒత్తిడికి గురయ్యారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన ఆయన చివరికి నిరాశతోనే జీవితం ముగించుకున్నారన్న వార్త అభిమానులను కలచివేస్తోంది.