మధ్యప్రదేశ్కు చెందిన ఇండోర్ బిజినెస్మెన్ రాజా రఘువంశీ హత్య కేసును మేఘాలయ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో రాజా భార్య సోనమ్ రఘువంశీ ప్రధాన సూత్రధారి అని విచారణలో తేలింది. తన ప్రేమికుడు రాజ్ కుష్వాహా సహకారంతో, నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లను ఉపయోగించి ఈ హత్యను అమలు చేసింది.
ఈ కేసును “ఆపరేషన్ హనీమూన్”గా పేరుమర్చిన మేఘాలయ పోలీసులు, 16 రోజుల పాటు, 120 మందికి పైగా పోలీసు బృందంతో మూడు రాష్ట్రాల్లో దర్యాప్తు నిర్వహించారు. నిందితులను ట్రాన్సిట్ రిమాండ్పై షిల్లాంగ్కు తరలించడంతోపాటు అక్కడ మరింతగా విచారణ జరుపనున్నారు.
ఎలా జరిగింది?
రాజా, సోనమ్ మే 11న పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ పేరుతో మే 21న మేఘాలయ బయలుదేరిన తర్వాత, మే 23న వారిద్దరూ కనిపించకుండా పోయారు. జూన్ 2న సోహ్రా ప్రాంతంలోని విసావాడోంగ్ జలపాతం సమీప లోయలో రాజా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇది సాధారణ ఘటన కాదని భావించిన పోలీసులు, ఫోన్ లో డేటాను అన్వేషించి అసలు కుట్రను వెలుగులోకి తెచ్చారు.
పూర్తి ప్లాన్.. ఫోన్ కాల్లు, ప్రయాణాలు
వివాహం తర్వాతే సోనమ్ ఈ హత్య ప్లాన్ చేసింది. మే 21న కిల్లర్లు గౌహతికి చేరుకోగా, మే 23న రాజాను హత్య చేశారు. అదే రోజు సోనమ్ గౌహతిలోంచి రైలు ద్వారా ఇండోర్ బయలుదేరింది. మే 25న అక్కడ రాజ్ను కలిసింది. హత్య అనంతరం ఇద్దరూ కాంటాక్ట్లో ఉన్నట్లు ఫోన్ వివరాలు చెబుతున్నాయి.
అరెస్టుల వివరాలు
సోనమ్ – ప్రధాన సూత్రధారి
రాజ్ కుష్వాహా – ప్రేమికుడు, ఇండోర్లో అరెస్ట్
విశాల్ అలియాస్ విక్కీ ఠాకూర్ – ఇండోర్లో అరెస్ట్
ఆకాష్ రాజ్పుత్ – లలిత్పూర్ (యూపీ)లో అరెస్ట్
ఆనంద్ – మధ్యప్రదేశ్లో అరెస్ట్
ఈ కేసులో తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సియెమ్, ఎస్పీ హెర్బర్ట్ ఖార్కోంగోర్ నేతృత్వంలో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్నిఫర్ డాగ్స్, మౌంటెనీరింగ్ క్లబ్ సహాయంతో తీవ్రంగా పని చేశారు.