Kommineni Srinivasa Rao: కొమ్మినేని శ్రీనివాసరావుకు షాక్‌.. 14 రోజుల రిమాండ్

రాజధాని అమరావతిలోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌కు గురయ్యారు. జూన్ 9న హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో కొమ్మినేనితో పాటు మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణరాజు కూడా నిందితుడిగా ఉన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో రాజధాని ఉద్యమకారులు, మహిళలు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. కొమ్మినేని నిర్వహించిన సాక్షి టీవీ డిబేట్‌లో కృష్ణరాజు “వేశ్యల రాజధాని” అనే పదాలను ఉపయోగించి అమరావతి మహిళలను అవమానించారని, ఆ వ్యాఖ్యల్ని కొమ్మినేని సమర్థించారని ఆరోపణలు వెలువడ్డాయి.

ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఐటీ చట్టం కింద నాన్-బెయిలబుల్ సెక్షన్లతో కొమ్మినేని, కృష్ణరాజు, అలాగే సాక్షి టీవీ యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి.

అరెస్ట్ అనంతరం కొమ్మినేనిని హైదరాబాద్ నుంచి విజయవాడ, అక్కడి నుంచి గుంటూరు రూరల్ నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల తర్వాత మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

Leave a Reply