Bonalu 2025: భాగ్యనగరంలో బోనాల జాతరకు భారీ ఏర్పాట్లు.. మంత్రి కొండా సురేఖ కీలక నిర్ణయం..!

తెలుగింటి ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ప్రాచీన పండుగ బోనాలు, తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాల ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం అమ్మవారికి బోనం సమర్పించే ఈ పండుగ.. గోల్కొండ కోటలో తొలి బోనం తో ప్రారంభమై, ఆషాఢ మాసంలోని ప్రతి ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది.

ఈ ఏడాది బోనాల ఉత్సవాలు జూన్ 26న ప్రారంభం కానున్నాయి. అదే రోజు గురువారం కావడంతో తొలిబోనం గోల్కొండలోని అమ్మవారికి అర్పించనున్నారు. దీని తరువాత బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజ వంటి ప్రాచీన దేవాలయాల్లో జాతరలు కొనసాగుతాయి.

ఈ నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా మొత్తం 28 దేవాలయాల్లో బోనాల ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.20 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసినట్లు వెల్లడించారు. అవసరమైతే అదనంగా నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లుతామని చెప్పారు.

గత ఏడాది ఏర్పాట్లలో తలెత్తిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. ఈసారి ముందస్తుగా ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ను రూపొందించాలన్నారు. “భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. ఈ విధుల్లో పాల్గొనే అధికారులు కేవలం ఉద్యోగంగా కాకుండా సేవగా భావించి బాధ్యతగా వ్యవహరించాలి” అని మంత్రి తెలిపారు.

రంగం, తొట్టెల ఊరేగింపులు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పండుగ వైభవాన్ని పెంచేలా ఉండాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ విషయంలోనూ పోలీస్ శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు. చివరగా, ఈ బోనాల జాతరను అత్యంత సుసంపన్నంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

వావ్ షాలినీ! వైట్ వెట్ లుక్‌తో ఫ్యాన్స్‌ని ఫిదా చేసిన అర్జున్ రెడ్డి బ్యూటీ..!

తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. 96 మందికి కీలక పదవులు

Leave a Reply