Nara Lokesh: జగన్‌కు లోకేశ్ వార్నింగ్.. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలి..!

అమరావతిపై అసత్య ప్రచారాలు, మహిళలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ జగన్ పై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. తల్లుల ఆత్మాభిమానాన్ని కించపరిచిన వ్యాఖ్యలు క్షమించరాని నేరంగా అభివర్ణించారు.

“అమరావతిపై విషం చిమ్మేందుకు తల్లులను అవమానించడం దిగజారుడుతనానికి పరాకాష్ట. మహిళల జోలికి వచ్చినా, వారికి అవమానం చేసినా అది వారి చివరి రోజు అవుతుందని చంద్రబాబు గారు చాలాసార్లు హెచ్చరించారు. జగన్ రెడ్డి మాత్రం ఈ హెచ్చరికలను విస్మరించి రాష్ట్ర మహిళల గౌరవాన్ని కాలరాస్తున్నారు” అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ మాయ రోగానికి మందు రెడీ

“జగన్ బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రాష్ట్రంలోని ప్రతి మహిళను బాధపెట్టే ఈ మాయ రోగాన్ని పూర్తిగా నయం చేస్తాం. ఆయన మీడియా అంత ఘోరంగా మహిళలను అవమానించేలా ఎలా ప్రసారం చేస్తోంది? ఈ దుర్మార్గపు చర్యలు మిమ్మల్ని కాలగర్భంలో కలిపేస్తాయి” అని హెచ్చరించారు.

అమరావతి – తల్లుల త్యాగాలతో నిర్మితమైన రాజధాని

“భూములను త్యాగం చేసిన తల్లుల పవిత్ర ఆశయంతో నిర్మితమైన అమరావతి – అది ముమ్మాటికీ దేవతల రాజధాని. మూడు రాజధానుల కపట కుట్రను వ్యతిరేకిస్తూ ‘జై అమరావతి’ నినాదం చేసిన మహిళల మనోభావాలను కించపరిచిన జగన్.. మహిళా లోకానికి బాధ కలిగించే మాటలు మాట్లాడే అర్హతను కోల్పోయారు,” అని లోకేశ్ స్పష్టం చేశారు.

మహిళలపై వ్యాఖ్యలకు కఠిన చర్యలు తప్పవు

“చీరలు, గాజులు, ఆడపిల్లలా ఏడవడం వంటి వ్యాఖ్యలు ఏవైనా చేసినా, కూటమి ప్రభుత్వం ఊరుకోదు. చిన్నతనంనుండి విద్యార్థులు మహిళలను గౌరవించేలా బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే వారిని చట్టపరంగా శిక్షిస్తాం” అంటూ నారా లోకేశ్ ఘాటుగా హెచ్చరించారు.

Leave a Reply