PM Modi: ఆపరేషన్ సిందూర్ పేరు వింటే పాక్ కు అదే గుర్తొస్తుంది.. ప్రధాని మోదీ

శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌లో పర్యటించారు. చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచపు అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ, “ఈ పేరును విన్నప్పుడల్లా పాకిస్తాన్‌కు ఓటమి గుర్తు వస్తుంది,” అని మోదీ వ్యాఖ్యానించారు. తీవ్రవాదానికి భారత్ ఎప్పటికీ తల వంచదని, దేశ సరిహద్దుల్లో శాంతిని భంగం చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు.

మోదీ మాట్లాడుతూ, “పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా దేశంలో మత కల్లోలాలు రేపాలనే కుట్రలు పన్నుతుంది. జీవనోపాధి కోసం పర్యాటకంపై ఆధారపడుతున్న కశ్మీరీ ప్రజలను పాక్ దోచుకుంటోంది,” అని విమర్శించారు.

పాక్ ఆకస్మిక దాడుల వల్ల ఇళ్లు కోల్పోయిన జమ్మూ కశ్మీర్ బాధితులకు నష్టపరిహారం కూడా ప్రకటించారు ప్రధాని. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు రూ.2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.1 లక్ష పరిహారం ఇస్తామని తెలిపారు.

పెహల్‌గామ్ ఘటనపై మోదీ తీవ్ర వ్యాఖ్యలు:

“ఏప్రిల్ 22న పెహల్‌గామ్‌లో పాకిస్తాన్ మానవత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఇది కశ్మీర్‌పై మాత్రమే కాకుండా భారతదేశం మీద దాడి,” అని మోదీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, “బ్రిటిష్ కాలంలో సాధ్యం కాలేని ప్రాజెక్ట్‌ను మోదీ పూర్తి చేశారు. వాజ్‌పేయ్ గారికి కృతజ్ఞతలు. ఆయనే ఈ ప్రాజెక్ట్‌కి జాతీయ హోదా కల్పించి బడ్జెట్ పెంచారు. ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను,” అని గుర్తు చేసుకున్నారు.

Leave a Reply