Bengaluru Stampede: బెంగళూరులో తొక్కిసలాట ఘటన.. ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ అరెస్ట్..!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన విషాద ఘటనపై కీలక తిరుగుబాటు చోటుచేసుకుంది. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్ట్ చేశారు.

ముంబై వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న నిఖిల్‌ను అక్కడే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయనతో పాటు ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ సంస్థకు చెందిన ముగ్గురు సిబ్బంది.. కిరణ్, సుమంత్, సునీల్ మాథ్యూలు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. వీరందరిని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.

ఈ ఘటనపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, RCB, DNA ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA)లను కూడా నిందితులుగా చేర్చారు. KSCA కార్యదర్శి, కోశాధికారి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి నివాసానికి వెళ్లిన పోలీసులకు అక్కడ వారు లేనట్లు స్పష్టమైంది.

RCB విజయోత్సవ ఈవెంట్‌ను DNA సంస్థతో కలిసి నిఖిల్ సోసాలే సమన్వయం చేసినట్లు విచారణలో పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, 64 మంది గాయపడ్డారు.

Leave a Reply