తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. నిన్న ఐదు గంటల పాటు కొనసాగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ఉద్యోగులపై వరాల జల్లులు కురిసాయి.
రెండు డీఏలు.. ఆర్థికంగా ఉపశమనం
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డియర్నెస్ అలౌన్స్లు (డీఏలు) ప్రకటించింది కేబినెట్. మొదటిది వెంటనే అమలులోకి రానుండగా, రెండోది ఆరు నెలల తర్వాత అమలవుతుంది. ఈ నిర్ణయం వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఊరటనిస్తుంది.
మహిళా సంఘాల కోసం రూ.70 కోట్లు
మహిళా స్వయం సహాయ సంఘాల సభ్యులకు ప్రమాద బీమా, లోన్ బీమాల కోసం ప్రభుత్వం రూ. 70 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇది ఆయా సంఘాల సభ్యులకు భద్రత కల్పించడంలో కీలకంగా నిలవనుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు సన్నద్ధం
ఒక డీఏను వెంటనే, రెండో డీఏను మరో ఆరు నెలల్లో చెల్లించాలని నిర్ణయం
ఉద్యోగుల బకాయిలు ఇకపై ప్రతి నెలా రూ.700 కోట్లు చెల్లింపు
ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం… pic.twitter.com/RFEGPVDAgU
— Telangana Congress (@INCTelangana) June 6, 2025
హెల్త్కేర్ ట్రస్ట్ ఏర్పాటు.. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు
ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక హెల్త్కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ప్రతి నెలా ఉద్యోగులు రూ. 500 చొప్పున చెల్లిస్తే, అదే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీనివల్ల ఉద్యోగులు ఆరోగ్య బీమా సేవలు పొందగలుగుతారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణపై చర్చ
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. మెట్రో సేవలను మరింత విస్తృతం చేయాలని, అవసరమైన ప్రణాళికలపై చర్చ సాగినట్లు సమాచారం.
ములుగు జిల్లాలో ఆయిల్ ఫ్యాక్టరీకి భూమి కేటాయింపు
ములుగు జిల్లా ఇంచర్లలో ఏర్పడనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కోసం 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని భట్టి వెల్లడించారు.