MI VS GT: క్వాలిఫయర్ 2కి దూసుకెళ్లిన ముంబయి.. టోర్నీకి గుడ్‌బై చెప్పిన గుజరాత్..!

ఐపీఎల్ 2025లో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. గుజరాత్ పై 20 పరుగుల తేడాతో గెలిచిన ముంబయి, క్వాలిఫయర్ 2లో అడుగుపెట్టింది. ఓడిన గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ముంబయి ఇచ్చిన 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో గుజరాత్ విఫలమైంది. సాయి సుదర్శన్ 49 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 80 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 24 బంతుల్లో 48 పరుగులు చేసి పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. కమిందు మెండిస్ (20), రూథర్‌ఫోర్డ్ (24), షారుఖ్ ఖాన్ (13) రాణించినా, చివర్లో ముంబయి బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో విజయం సాధించారు.

ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీయగా, బుమ్రా, గ్లిసన్, శాంట్నర్, అశ్వనీ కుమార్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు. దీంతో గుజరాత్ 208 పరుగులకే పరిమితమైంది.

ఇక క్వాలిఫయర్ 2లో ముంబయి ఇండియన్స్ ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్ విజేత ఐపీఎల్ ఫైనల్‌లో ఇప్పటికే అడుగుపెట్టిన ఆర్సీబీతో పోరాడుతుంది.

ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ 39 బంతుల్లో 81 పరుగులు చేసి తిరుగులేని ఇన్నింగ్స్ ఆడాడు. బెయిర్‌స్టో (47), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (25), హార్దిక్ పాండ్యా (22) కలిసి ముంబయి భారీ స్కోర్‌కు దారితీశారు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు:

ఐపీఎల్‌లో 7,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.

300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్, సాయి కిషోర్ చెరో 2 వికెట్లు తీసారు. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.

Leave a Reply