కోవర్ట్‌లపై అప్రమత్తంగా ఉండండి.. టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు హెచ్చరిక

కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. “రాబోయే 47 సంవత్సరాలకు టీడీపీ స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది. తెలుగుజాతిని ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలబెట్టాలన్నది మా లక్ష్యం. ఇది నా కోట్‌గానే గుర్తుంచుకోండి,” అని అన్నారు.

పార్టీలోకి వలస పక్షులు రావడం, పోవడం సాధారణమని పేర్కొన్న చంద్రబాబు, నిజమైన కార్యకర్త మాత్రం ఎప్పుడూ పార్టీలోనే ఉంటారని స్పష్టం చేశారు. కోవర్ట్‌లుగా చేరి పార్టీలో అంతర్గత అజెండా నెరవేర్చాలన్న వారు టీడీపీలోకి నొప్పించలేరని స్పష్టంచేశారు. ముఖ్యంగా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, నేరస్థుల మాయా కనికట్టు నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య ప్రచారం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. వివేకా మరణం గుండెపోటుతోనే జరిగిందని, తాను సహా అందరూ అదే నమ్మారని అన్నారు. తన లాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే, ఎవరి నైనా మోసం చేయగలరన్న నమ్మకం కలుగుతోందని వ్యాఖ్యానించారు.

ఆరు శాసనాల ద్వారా పార్టీ దిశ మార్చనున్నట్లు వెల్లడించిన చంద్రబాబు, ఈ శాసనాలే 2047 నాటికి తెలుగు ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు దారి చూపుతాయని తెలిపారు. నూతన నాయకత్వాన్ని తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, “మళ్లీ జన్మ లభిస్తే తెలుగువాడిగా పుడతాను” అని చెప్పుకొచ్చారు. “కార్యకర్తే అధినేత.. వారే నాకు హైకమాండ్‌” అని స్పష్టం చేశారు. టీడీపీ జెండా 43 ఏళ్లుగా రెపరెపలాడుతోందంటే అది కార్యకర్తల త్యాగాల వల్లేనన్నారు.

పల్నాడులో జరుగుతున్న హత్యలపై మండిపడ్డ చంద్రబాబు, కొంతమంది కోవర్ట్‌లుగా టీడీపీలోకి చేరి ప్రతీకార హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి కుట్రలకు అవకాశం లేదని, కోవర్ట్‌లకు టీడీపీలో స్థానం లేదని హెచ్చరించారు.

సామాజిక న్యాయం మాటలకే పరిమితం కాకుండా, టీడీపీ అక్షరాలా అమలు చేసి చూపిందని గుర్తుచేశారు. త్వరలో “తల్లికి వందనం” పథకాన్ని అమలు చేస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. ఆరు శాసనాలే పార్టీ భవిష్యత్తుకు గేమ్ చేంజర్‌గా మారుతాయని, వాటిని చివరి దశ వరకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply