Miss World 2025: మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం..!

హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలపై వివాదం ముంచుకొస్తోంది. తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ప్రపంచ సుందరి పోటీలపై మిల్లా మాగీ చేసిన ఆరోపణలు తీవ్రంగా మారడంతో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు శిఖా గోయల్, రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీలతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాల కంటెస్టెంట్లతో ప్రత్యక్షంగా మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

వివిధ దేశాల కంటెస్టెంట్‌లను వ్యక్తిగతంగా కలిసి, పోటీల నిర్వహణ తీరుతో పాటు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఎవరైనా ఒత్తిడి తీసుకువచ్చారా? వంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ విచారణ ప్రక్రియలో వీడియో రికార్డింగ్ కూడా జరుగుతోంది.

మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణల నేపథ్యంలో, ఆమె పాల్గొన్న డిన్నర్ ఈవెంట్ గురించి స్పష్టతకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆమెతో పాటు ఆ డిన్నర్‌కు హాజరైనవారు ఎవరు? ఎవరి సమీపంలో కూర్చున్నారు? అనే వివరాలను సేకరించి పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందించనున్నారు.

ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రతిష్టకి సంబంధించిన అంశమని పేర్కొంటూ, విచారణ సమగ్రంగా, పారదర్శకంగా జరగాలన్న ఆదేశాలు జారీ చేశారు. అలాగే మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌లతో కూడా అధికారుల బృందం సంప్రదించి వివరాలు తెలుసుకుంది.

మిల్లా మాగీ తన ఆరోపణలలో, “హైదరాబాద్‌లో ఉన్న సమయంలో సంపన్న పురుష స్పాన్సర్లను ఆకట్టుకోవాలని ఒత్తిడి చేశారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. “ఇది పోటీలా అనిపించలేదు. మేము పోటీలకు వచ్చామా, లేక ఇంకేదానికైనా వచ్చామా తెలియదు” అంటూ పేర్కొంది. పోటీ మధ్యలోనే ఆమె మిస్ వరల్డ్-2025 నుండి వైదొలగి ఇంగ్లాండ్ తిరిగివెళ్లిపోయింది. అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలు బ్రిటిష్ మీడియాలో ప్రచురితమయ్యాయి.

అయితే ఆమె ఆరోపణలను మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మోర్లీ తీవ్రంగా ఖండించారు. “వీటిలో ఏమాత్రం వాస్తవం లేదు” అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కూడా అదే ధోరణిలో స్పందించారు. అయినప్పటికీ ఆరోపణలపై సమగ్రంగా స్పష్టత తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Leave a Reply