ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టాలీవుడ్ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలతో కొన్ని థియేటర్లు మూతపడటంపై స్పందిస్తూ, సినీ పరిశ్రమ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హరి హర వీరమల్లు సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ టాలీవుడ్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రకారం, తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలన్న దిశగా ప్రభుత్వం పనిచేస్తుంటే, సినీ రంగం నుండి సరైన స్పందన లేకపోవడం ఆవేదన కలిగించిందని చెప్పారు. ప్రభుత్వం తమ వంతు సహకారాన్ని అందించిందని, కానీ సినిమా సంఘాలు ముఖ్యమంత్రిని కలవకపోవడం నిరాశ కలిగించిందన్నారు. “చిత్రాల విడుదల సమయంలో మాత్రమే వ్యక్తిగతంగా వచ్చి టికెట్ ధరలు పెంచాలని కోరడం మినహా, పరిశ్రమ అభివృద్ధిపై ఎవ్వరూ ఒకటిగా ముందుకురాలేదు” అని వ్యాఖ్యానించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, సంఘాలు గత ప్రభుత్వం విధించిన ఆంక్షలను, అవమానాలను మరిచిపోయినట్టు కనిపిస్తుందన్నారు పవన్. “తహసీల్దార్లను థియేటర్ల వద్ద ఉంచి సినిమాలపై ఒత్తిడి తెచ్చిన రోజులు ఎవరు మర్చిపోగలరు?” అని ప్రశ్నించారు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన సినిమాకు ప్రభుత్వం ఇచ్చిన సహకారం అందరికీ స్పష్టంగా చూపించిందన్నారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విజ్ఞప్తులకు ఇక తావులేదని స్పష్టం చేశారు. “ఇక్కడినుంచి ప్రతి అంశం సంబంధిత శాఖలతోనే చర్చించబడుతుంది. ప్రభుత్వ విధానం స్పష్టంగా – వ్యక్తులకంటే వ్యవస్థ ముఖ్యం” అని అన్నారు. టికెట్ ధరలు, పన్నుల వసూలు, థియేటర్ల నిర్వహణ వంటి అంశాల్లో పూర్తి పారదర్శకత కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చిత్రపరిశ్రమ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
సినీ రంగాన్ని అడ్డుపెట్టుకుని అనవసరంగా వివాదాలు సృష్టించేందుకు చేసే ప్రయత్నాలను సహించం. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయంపై హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం. పరిశ్రమకు నష్టం వాటిల్లకుండా, డిస్ట్రిబ్యూటర్లు,… pic.twitter.com/FVvJwhNvKt
— Kandula Durgesh (@kanduladurgesh) May 24, 2025
థియేటర్లలో లీజుదారుల స్థితిగతులు, ఆదాయానికి తగ్గ పన్ను వస్తుందా అనే విషయాలను పన్నుల శాఖ పరిశీలిస్తోందని చెప్పారు. తినుబండారాల ధరలు, మంచినీటి సౌకర్యం వంటి అంశాలపై కూడ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, తూనికలు కొలతల శాఖలతో నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
సినిమా రంగం అభివృద్ధి కోసం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయమై సంపూర్ణ చర్చ చేసి, కొత్త పాలసీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. మల్టీప్లెక్స్ స్థాయి హాళ్లపై, టికెట్ ధరల వ్యత్యాసాలపై కూడా సమగ్రంగా సమీక్ష జరుగుతుందన్నారు.