Bengaluru Rains: వర్షాలతో విలయం – ట్రాఫిక్ నరకం.. బెంగళూరులో వర్క్ ఫ్రమ్ హోమ్ డిమాండ్!

బెంగళూరులో మంగళవారం కురిసిన అకాల భారీ వర్షాలు నగర జీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశాయి. ముఖ్యంగా నగరానికి కీలకమైన హోసూరు రోడ్డు జలమయం కావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాళ్ల లోతు వరకూ నిలిచిన నీరు, గంటల తరబడి కదలని వాహనాలు, నిస్సహాయంగా కార్లను వదిలేసి వెళ్లిపోయిన ప్రయాణికులు.. నగరం నరకప్రాయంగా మారింది.

సాధారణంగా ఎప్పుడూ రద్దీగా ఉండే సిల్క్ బోర్డు నుండి రూపేన అగ్రహారం వరకు ఉన్న హోసూరు రోడ్డు పూర్తిగా మూసివేయబడింది. అంతేకాదు, ట్రాఫిక్ భారం తగ్గించేదిగా భావించిన ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కూడా తాత్కాలికంగా మూసేశారు. “భారీ వర్షాల కారణంగా హోసూరు రోడ్డు, ఎలివేటెడ్ ఫ్లైఓవర్ మూసివేయబడ్డాయి. దయచేసి ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించండి” అని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

సెంట్రల్ సిల్క్ బోర్డు నుండి ఎలక్ట్రానిక్స్ సిటీ వరకు సాగిన ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే మూసివేతతో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ సంస్థల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు కార్యాలయాలకు చేరలేకపోయారు. మాడివాల అండర్‌పాస్ వద్ద నీరు నిలిచిపోవడంతో హోసూరు రోడ్డుకు ఇరువైపులా రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. కస్తూరి నగర్, మైసూరు రోడ్డు టోల్‌గేట్ వంటి ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది.

వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్, నగరంలోని ఐటీ కంపెనీలు రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. “ఇది ఉద్యోగుల భద్రతకు తోడ్పడుతుంది. నగరంపై ట్రాఫిక్ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది” అని ఆయన X (ట్విట్టర్) వేదికగా సూచించారు.

ఇలాంటి వరదలు తరచూ రావడం, ముఖ్య రహదారులు మూత పడడం, ట్రాఫిక్ స్తంభించడం లాంటివి బెంగళూరు నగర ప్రణాళికలో వర్షపు నీటి నిర్వహణపై ఉన్న లోపాలను బట్టబయలు చేస్తున్నాయి. శాశ్వత పరిష్కారాల వైపు అధికారులు కదలాల్సిన అవసరం మరింతగా పెరిగింది.

ప్రస్తుత పరిస్థితుల్లో హోసూరు రోడ్డుకు దూరంగా ఉండండి. అధికారుల తాజా ట్రాఫిక్ మార్గదర్శకాలను అనుసరించండి. అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అనుసరించండి. భద్రతే ముఖ్యం.

Leave a Reply