Byjus 3.0: బైజూస్ 3.0 త్వరలో.. బైజూ రవీంద్రన్ కీలక ప్రకటన..!

ఆర్థిక ఇబ్బందులతో వార్తల్లో నిలిచిన ఎడ్టెక్ దిగ్గజం బైజూస్‌ మరోసారి హైలైట్‌లోకి వచ్చింది. కంపెనీ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే బైజూస్ 3.0 ని మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వర్షన్ అభివృద్ధి దశలో ఉందని తెలిపారు.

ఒక పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రవీంద్రన్, తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. “ఇది నా జీవిత లక్ష్యం. ఈసారి మరింత స్పష్టత, క్రమంతో బైజూస్‌ను మళ్లీ నిర్మిస్తున్నాం. జెనరేటివ్‌ ఏఐ ఆధారంగా ప్రతి విద్యార్థికి వ్యక్తిగత ట్యూటర్‌ను అందించడమే మా లక్ష్యం. మా బృందం దీని కోసం శ్రమిస్తోంది,” అన్నారు.

బైజూస్ 2022 నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా, కంపెనీపై నమ్మకంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. “మా నిధులు దుర్వినియోగం కాలేదు. 2021లో అమెరికా నుండి సేకరించిన 1.2 బిలియన్ డాలర్లు వ్యాపార విస్తరణకే వినియోగించాం. కానీ కొన్ని వర్గాలు కోర్టు ప్రక్రియలపై తప్పుదారి పట్టించే కథనాలు సృష్టిస్తున్నాయి,” అని ఆరోపించారు.

“మేము కోర్టు రూమ్‌లవాళ్ళం కాదు… క్లాస్‌రూమ్‌లవాళ్ళం” అంటూ విద్యార్థులపై తమ నిబద్ధతను రవీంద్రన్ స్పష్టం చేశారు. తాము విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులపై నమ్మకం ఉంచినవారమని, అందుకే బైజూస్‌ను వదలకుండా నడిపిస్తున్నామని చెప్పారు.

బైజూస్ 3.0 కొత్త దిశగా, కొత్త లక్ష్యాలతో ప్రయాణం మొదలు పెట్టబోతుందని తెలిపారు.

Leave a Reply