Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్‌: AAP రెండుగా చీలిక.. 13 మంది జంప్!

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర అంతర్గత సంక్షోభానికి లోనై, ఢిల్లీలో పార్టీ రెండుగా చీలిపోయినట్టు సమాచారం. తాజా పరిణామాల్లో ఆప్‌కు చెందిన 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసి, కొత్త గ్రూపుగా ఎదగాలని ప్రకటించారు.

ఈ రెబల్ కౌన్సిలర్లు ఇంద్రప్రస్త వికాస్ పార్టీ పేరుతో కొత్త వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

రాజీనామా చేసిన కౌన్సిలర్లు:
ముఖేష్ గోయల్, హేమంచంద్ గోయల్, దినేష్ భరద్వాజ్, హిమానీ జైన్, ఉషా శర్మ, సాహిబ్ కుమార్, రాఖీ కుమార్, అశోక్ పాండే, రాజేష్ కుమార్, అనిల్ రాణా, దేవేంద్ర కుమార్, హిమానీ జైన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. వీరికి హేమంచంద్ గోయల్ నేతృత్వం వహించనున్నారు.

ఇప్పటికే మూడు నెలల క్రితం ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. తాజాగా మరో 13 మంది బహిష్కరణతో, ఆప్ పార్టీ భవిష్యత్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రాజీనామా వెనుక అసలైన కారణం ఏమిటి?
2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో వీరంతా ఆప్ టికెట్‌పై విజయం సాధించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీ నేతలు మున్సిపల్ కార్పొరేషన్‌ను సక్రమంగా నడిపించలేకపోయారని వారు విమర్శిస్తున్నారు. స్థానిక నాయకత్వం తమతో సరైన సమన్వయం లేకుండా పని చేస్తోందని ఆరోపిస్తూ, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయిందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ సంఘటనతో ఆమ్ ఆద్మీ పార్టీలో విడిపోయే ప్రక్రియ మొదలైనట్టే కనిపిస్తోంది. ఇంద్రప్రస్త వికాస్ పార్టీ ఏర్పాటుతో ఢిల్లీ రాజకీయ దృశ్యం మారబోతుందా అన్నది గమనించాల్సిన అంశం.

Leave a Reply