దేశ సైన్యం మోదీ పాదాలకు నమస్కరిస్తుందంటూ.. డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్‌డా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దేశ సైన్యం ప్రధాని మోదీ పాదాలకు నమస్కరిస్తుందని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

ఇటీవల భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమవడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, జబల్పూర్‌లో నిర్వహించిన సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జగదీష్ మాట్లాడుతూ

“ప్రధాని మోదీకి మనం కృతజ్ఞతలు చెప్పాలి. దేశం మొత్తం ఆయన పాదాలకు నమస్కరిస్తోంది. మన సైన్యమే ఆయనకు సెల్యూట్ చేస్తోంది. మోదీ ఇచ్చిన సమాధానానికి ఎంత ప్రశంసలు చెప్పినా తక్కువే” అని అన్నారు.

అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే విపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి.కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు.. “దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించే సైనికుల త్యాగాలను ఇలా రాజకీయ లాభాల కోసం వాడటం సరైంది కాదు” అంటూ మండిపడ్డారు. దేశ సైన్యాన్ని రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరమని ఆరోపించారు.

ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జగదీష్ దేవ్‌డా వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ మరింత చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply