ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయం నేపథ్యంలో, మే 16న సాయంత్రం 7 గంటలకు విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డా. పురందేశ్వరి(Purandeswari) పాల్గొననున్నారు.
భారత సైన్యానికి మద్దతుగా తెలుగు రాష్ట్రాల ప్రజల గౌరవాన్ని వ్యక్తపరిచేలా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కలిసి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ సాగనుంది. ర్యాలీ సమయానికి బందర్ రోడ్లో ట్రాఫిక్ నిలిపివేయనున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని సూచించారు.
ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ జాతీయ పతాకాన్ని అందించనున్నారు. తాత్కాలిక మెడికల్ క్యాంపులు, చల్లటి తాగునీటి స్టాళ్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ర్యాలీలో భాగంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు, గరగ నృత్యాలు, డప్పులు, తప్పెట గుళ్ళు, దేశభక్తి గీతాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా 500 మీటర్ల పొడవైన జాతీయ పతాకంతో విద్యార్థులు పాల్గొననున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఈ ర్యాలీ, జాతీయతా స్పూర్తిని బలపరిచే కార్యక్రమంగా నిలవనుంది. మూడు పార్టీలు కలసి దేశభక్తి ప్రదర్శనకు ఈ ర్యాలీని విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.