హ్యాట్సాఫ్.. ఇండియన్ ఆర్మీకి తన పాకెట్ మనీ విరాళంగా ఇచ్చిన 8 ఏళ్ల బాలుడు!

తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లాకు చెందిన 8 ఏళ్ల సాయి ధన్విష్ తన చిన్న చిన్న పొదుపు డబ్బును దేశ రక్షణ కోసం వెచ్చించాడు. గత పదినెలలుగా జత చేసుకున్న తన పాకెట్ మనీ మొత్తాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

2వ తరగతి చదువుతున్న సాయి ధన్విష్ ఇటీవల తన తల్లిదండ్రులతో కలిసి కరూర్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి, తాను పొదుపు చేసిన డబ్బును కలెక్టర్‌కు అందజేశాడు. “మనల్ని రక్షించే సైనికులకు నేను నా శక్తి మేరకు సహాయం చేయాలనుకుంటున్నాను. ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను,” అని ధన్విష్ మీడియాతో చెప్పాడు. చిన్న వయస్సులో ధన్విష్ చూపిన దేశభక్తి మరెందరికో ఆదర్శం.

ఇదే కాదు, గతంలో వయనాడ్ ప్రాంతంలో జరిగిన కొండచరియల విపత్తులో బాధితుల కోసం కూడా ధన్విష్ తన వంతు సహాయం అందించాడు. చిన్నతనమే అయినా, తన కలెక్ట్ చేసుకున్న డబ్బును అవసరమైన వారికి అందించడం ద్వారా ధన్విష్ గొప్ప ఆదర్శాన్ని చూపిస్తున్నాడు.

వెల్లియానైలో చేపల దుకాణం నడుపుతున్న సతీష్ కుమార్, పవిత్ర దంపతుల కుమారుడైన ధన్విష్‌కు జితేష్ అనే నాలుగేళ్ల తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు జూన్ 29న ధన్విష్ అవసరమైన వారికి ఆహారం, దుస్తులు పంపిణీ చేయడం అతడి మనసులోని పెద్దతనాన్ని చాటుతోంది.

ఇంత చిన్న వయసులో తన దేశాన్ని, సమాజాన్ని ప్రేమించగలిగే ఆలోచనలు ఏర్పడడం నిజంగా గుర్తింపు లభించాల్సిన విషయం. అతడి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Leave a Reply